హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15లోగా పూర్తవుతుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అభిప్రాయపడుతున్నారు. శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇదే విషయాన్ని చెబుతున్నారు. సాధారణ ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన పూర్తవుతుందని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదంటున్నారు. ఎంత ఆలస్యం చేసినా ఫిబ్రవరి 15 నాటికి తెలంగాణ ఖాయమని, ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ రాష్ట్రపతి పాలన ఉంటుందని దామోదర వివరించారు.
రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గాల రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని, అందుకు ఎన్నికల సంఘానికి తగిన సమయం అవసరమవుతుందని తెలిపారు. రెండు ప్రాంతాల్లో శ్రేణులను సాధారణ ఎన్నికలకు సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోందని, వారం పదిరోజుల్లో రెండు ప్రాంతాల్లో పీసీసీ నేతృత్వంలో రెండు తాత్కాలిక ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేస్తారని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.