కృష్ణా ఎక్స్ ప్రెస్ స్ కు పెను ప్రమాదం తప్పింది. వరంగల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చింతలపెల్లి రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్ను టీటీ ట్రాక్ మిషన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. రైలు ట్రాక్ రిపేరు అవుతుండటంతో బుధవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న రైలును చింతలపల్లి వద్ద నిలిపివేశారు. అయితే ఇదే ట్రాక్పై ఉన్న టీటీ ట్రాక్ మిషన్ మెల్లగా వెనక్కి కదులుతూ వచ్చి దాని వెనకాల కొద్ది పాటి దూరంలో నిలిచి ఉన్న కృష్ణా ఎక్స్ప్రెస్ ఇంజన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్ మిషన్ డ్రైవర్తో పాటు సహాయకులు నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. ప్రయాణికులెవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అరగంట సమయం తర్వాత ట్రాక్ మిషన్ను వేరే లైన్లోకి మార్చడంతో ఆలస్యంగా కృష్ణా ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి వరంగల్ వైపు బయలుదేరి వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా.. రైలు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఘటనపై విచారణకు ఆదేశం: రైల్వే సీపీఆర్వో
కృష్ణా ఎక్స్ప్రెస్ ఘటనపై విచారణ జరపవలసిందిగా దక్షిణమధ్యరైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాస్తవ ఆదేశించారని ఎస్సీఆర్ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి కె.సాంబశివరావు తెలిపారు. సంఘటన గురించి తెలియగానే... సికింద్రాబాద్ నుంచి ఉన్నతాధికారుల బృందం చింతపల్లికి బయల్దేరినట్టు ఆయన పేర్కొన్నారు.
మూడు గంటలు నిలిచిన తెనాలి-రేపల్లె ప్యాసింజర్
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెనమర్రు వద్ద బుధవారం తెనాలి-రేపల్లె ప్యాసింజర్ రైలు (నెం: 77226) సాంకేతి లోపం కారణంగా మూడు గంటలకు పైగా నిలిచిపోయింది. తెనాలి నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు రేపల్లెకు బయలుదేరిన రైలు పెనమర్రు లెవల్ క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న గేదెలను ఢీకొంది. ఈ ఘటనలో మూడు గేదెలు మృతి చెందాయి. వీటి శరీర భాగాలు ఇంజన్ కింది భాగంలో చిక్కుకు పోవటంతో చక్రాలు పట్టి రైలు నిలిచిపోయింది. ఇదే సమయంలో వాక్యూమ్ పైపు పగిలి పోవటంతో బ్రేకులు కూడా ఫెయిలయ్యాయి. దీంతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పెనమర్రు లెవల్ క్రాసింగ్ వద్దే రైలు నిలిచిపోయింది.