అనంతపురం, డిసెంబర్ 23 : మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన నాయకులని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. సోమవారం నీలం సంజీవరెడ్డి శతజయంతి ముగింపు ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం సంజీవరెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాల్గొన్న రాష్ట్రపతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నీలం ఈ గడ్డ ముద్దు బిడ్డగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు.
చిన్న వయసులోనే రాష్ట్రపతిగా ఎన్నికైన ఘనత నీలం సంజీవరెడ్డికే దక్కుతుందన్నారు. నీలం రెండు సార్లు లోక్సభ స్పీకర్గా పనిచేశారని, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని స్పీకర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే పార్టీకి రాజీనామా చేశారన్నారు. నాటి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీస్ రాగానే ఉభయసభల్లోనూ చర్చకు అనుమతించారని గుర్తు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితోనే నీలం ముందుకు సాగారని, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు సైతం వెళ్లారని రాష్ట్రపతి తెలిపారు.