Recent Posts

జై ఆంధ్రా - జై తెలంగాణా

15, డిసెంబర్ 2009, మంగళవారం
 జై ఆంధ్రా - జై తెలంగాణా  

బయట జరుగుతున్న వాటిమీద నాకు పెద్దగా అవగాహన లేదు. అక్కడి ప్రజలు పడిన, పడుతున్న బాధలూ తెలీదు. టీ వీ చానెళ్ళలో చూపించేవి చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో...ఎవరిది కరెక్టో ఎవరిది కాదో కూడా అర్ధం కావట్లేదు. నా బాధ ఒకటే..నిన్నటిదాకా పక్క పక్కనే ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎందుకు విడిపోతున్నారు. రాష్ట్రాలుగా కాదు..మనుష్యులుగా.

ఆంధ్ర మెస్ అని ఉంటే చెరిపేసి తెలంగాణా మెస్ అని రాస్తున్నారు..భోజనం మారుతుందా. రుచి మారిపోతుందా. ఆంధ్ర మహిళా సభ అని ఉంటే తెలంగాణా మహిళా సభ అని మారుస్తున్నారు. దేశం కోసం కష్టపడ్డ స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గా బాఇ దేశ్ ముఖ్ ఆత్మ ఘోషించదా. ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆవిడ పెట్టిన ఓ సేవా సంస్థ అది. ఇప్పుడు విడిపోతే ఆమె పెట్టుకున్న పేరు మార్చెయ్యాలా. ఆంధ్ర అంటే తెలంగాణా కానిదా. తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ లో లేదా.. ఆంధ్ర బ్యాంక్ కూ కొన్ని చోట్ల పేరు మార్చారు. భోగ రాజు పట్టాభి రామయ్య ఎప్పుడో మొదలెట్టిన ఆ అద్భుతాన్ని అవమానపరచాలా. మనం తలెత్తుకు ఎగురేసే జాతీయ జెండా తెలుగు వాడైన పింగళి వెంకయ్య తయారు చేసారు. మరి రేపు అదీ వద్దా..మనం వేరే జెండా తయారు చేసుకుందామా? మన ఎజెండాలో అదీ ఉందా?

ప్రాంతం కోసం జరిగే ఈ సమరం లో కొంచెం సమ్యమనం పాటించి..ఆవేశం తగ్గించి..మనకో పక్క వాళ్ళకో ప్రాణ నష్టం మరే నష్టం కలగ కుండా చూసుకొంటే మంచిది. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన స్టూడెంట్లు అందించే ఆ ఫలం అందుకుని ఆ కుటుంబ సభ్యులు ఆనందించ గలరా..వాళ్ళూ స్వతంత్ర్య పోరాట యోధులు గా మిగిలుతారా? లేక ఈ రాజకీయ నాయకుల పనుల్లో సమిధలుగా మిగులుతారా?

ప్రజల ముందు ఒక మాట..వెనకాల ఒక మాట చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయనాయకులని నమ్మి అమాయకులైన కుటుంబ సభ్యుల జీవితాలను పణంగా పెట్టి ప్రాణ త్యాగాలు చెయ్యకండి మిత్రులారా..మీదైనా..పక్కవాడిదైనా ప్రాణం విలువ సమానమే..గాంధీ మార్గంలో సాధించండి..విజయీ భవ.





నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

వినోదం - తాజా - Google వార్తలు